Tamilisai : తెలంగాణలో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం అంతకంతకు పెరుగుతోంది. సీఎం కేసీఆర్, తమిళిసై మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం మరో వివాదాన్ని రేపింది. తెలంగాణలో పరిస్థితులు, కేసీఆర్ ను ఉద్దేశించి తమిళ సై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు గవర్నర్ పై మరోసారి డైరెక్ట్ గా విమర్శలకు దిగారు. మాటల దాడిని మరింత పెంచారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ తమిళిసై మాట్లాడారని విమర్శించారు. ఆమెపై రాష్ట్రపతికి లేఖ రాస్తామని తెలిపారు. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటం తగదన్నారు.
ఎమ్మెల్సీ కవిత గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కొత్త పార్లమెంట్ భవనం- సెంట్రల్ విస్టా నిర్మాణం పై కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నేతలు కోరారని గుర్తు చేశారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజు, సీఎం కేసీఆర్ ప్రశ్నించిన అంశాలనే మళ్లీ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు అంటూ సెటైరికల్ గా కవిత ట్వీట్ చేశారు.
రాజ్భవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. రాజ్భవన్లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సంచలన స్పీచ్ ఇచ్చారు. కొందరికి తాను నచ్చకపోవచ్చునని కానీ తెలంగాణ అంటే తనకిష్టమన్నారు. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని తేల్చిచెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం అంటూ పిలుపునిచ్చారు. కొందరికి ఫార్మ్హౌస్లు కాదు.. అందరికీ ఫార్మ్లు కావాలన్నారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ ఆరోపించారు. రాష్ట్రంలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
బీఆర్ఎస్ నేతల విమర్శల తర్వాత గవర్నర్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై తీరుపై విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరి పర్యటనకు వెళ్లిన తమిళి సై తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారని.. ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చిందని తెలిపారు. గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశానని…అయితే రాజ్భవన్లోనే జరుపుకోవాలని 2 రోజుల క్రితమే సమాచారమిచ్చారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం పంపలేదన్నారు. అయితే గణతంత్ర వేడుకలు ప్రజల మధ్య జరుపుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని గవర్నర్ అన్నారు.