Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. అసాధారణ పరిస్థితుల్లో ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను 2020లో నిలిపివేశామని తెలిపింది. ప్రస్తుతం తిరిగి ఆయన ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో తిరిగి ఆయన ఖాతాలను పునరుద్ధరించినట్లు వెల్లడించింది.
2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలు కావడంతో.. ఆయన మద్ధతుదారులు క్యాపిటల్ హిల్పై దాడికి దిగారు. ఆ సమయంలో విధ్వంసం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ చేసిన ప్రకటనల వల్లే వారు దాడికి దిగారని ఆ సమయంలో వార్తలు వచ్చాయి. ఈక్రమంలో సామాజిక మాధ్యమాలు అతని ఖాతాలను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని తాము భావిస్తున్నట్లు మెటా పేర్కొంది. వారు చెప్పే విషయాల్లో వాస్తవాలు లేకపోయినా మాట్లాడే అవకాశం ఇవ్వాలని వెల్లడించింది. అయితే గతంలో జరిగిన తప్పులను మాత్రం పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పింది. ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశాక ట్రంప్ ఖాతాను పునరుద్ధరించిన విషయం తెలిసిందే.