Tamilisai: రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈకార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తమిళిసై తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి అని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువకులు కలిగిన దేశం భారత్ అని వెల్లడించారు. యువకులు సవాళ్లను ఎదుర్కోవాలని.. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని సూచించారు. విద్య, పరిశోధన అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు.
తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారులు, రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ గౌరవాన్ని.. ప్రజాస్వామ్యాన్ని .. హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కొందరికి తాను నచ్చకపోయినా.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం.. పథకాల అమలు కోసం.. ప్రభుత్వాన్ని గైడ్ చేయడం తన బాధ్యతని తెలిపారు. కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదని.. అభివృద్ధి అంటే జాతి నిర్మాణం అని అన్నారు. ఫామ్హౌజ్ కట్టడం అభివృద్ధి కాదని… పేదల ఆకాంక్షలు నెరవేరాలని తమిళిసై వెల్లడించారు.