CBI: నీ ఇంటికొచ్చా.. నీ నట్టింటికొచ్చా.. అనే రేంజ్ లో వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. పులివెందులలోని ఎంపీ అవినాష్రెడ్డి ఇంటికెళ్లింది సీబీఐ టీమ్. రెండు వాహనాల్లో, ఐదుగురు అధికారులు ఆయన కోసం నేరుగా ఇంటికొచ్చారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. ఇంటి పరిసరాలను పరిశీలించారు. దాదాపు పావు గంట పాటు ఎంపీ ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత మరో గంట పాటు వాహనాల్లో పులివెందులలో చక్కర్లు కొట్టారు. వివేకా ఇంటి పరిసరాలను మరోసారి పరిశీలించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది సీబీఐ. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఎంక్వైరీ. ఆలోగా అంత అర్జెంట్ ఏముందని సీబీఐ టీమ్ పులివెందులకు వెళ్లింది? నోటీసులు ఇచ్చాక కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికెళ్లాల్సిన అవసరం ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది. అవినాష్ రెడ్డి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందని అనుమానించారా? లేదంటే, నేరుగా అరెస్ట్ చేసేందుకే వెళ్లారా? అంటూ ప్రచారం జరుగుతోంది.
వివేకా హత్య కేసులో మొదటి నుంచీ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంత ఘోరంగా మర్డర్ జరిగితే.. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ప్రకటించడం అనేక అనుమానాలకు కారణమైంది. ఆయనే బాబాయ్ ని చంపించారంటూ టీడీపీ ఆరోపించింది. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి సైతం విచారణలో అవినాష్ రెడ్డి పేరు పలుమార్లు చెప్పారు. కేసులో ఇంత కీలకంగా ఉన్న ఆయన్ను.. సుమారు మూడేళ్ల లేట్ తర్వాత.. ఇప్పుడు లేటెస్ట్ గా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతుండటం.. రాజకీయంగా ఉత్కంఠగా మారింది. రెండుసార్లు నోటీసులు ఇవ్వడం.. నేరుగా ఆయన ఇంటికెళ్లడం.. పులివెందులలో ఎంక్వైరీ చేయడం.. వరుస పరిణామాలు చూస్తుంటే ఏదో బిగ్ మూవ్ జరగొచ్చనే అంటున్నారు.