ICC ODI Rankings : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిలిచాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన భారత్ (114 రేటింగ్ పాయింట్లు) టీమ్ ర్యాంకింగ్స్లో.. ఇంగ్లండ్ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటికే టీ20ల్లోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది. త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్ను 2-0 లేదా అంతకంటే మెరుగ్గా గెలిస్తే 3 ఫార్మాట్లలోనూ భారత్ నంబర్ వన్గా నిలుస్తుంది.
బౌలింగ్ విభాగంలో భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తొలిసారి వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. టీమిండియా తరఫున బుమ్రా తర్వాత వన్డేల్లో టాప్ ర్యాంక్ సాధించిన బౌలర్గా ఘనత సాధించాడు. న్యూజిలాండ్, శ్రీలంకలతో జరిగిన సిరీస్ల్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్లో 3 మ్యాచ్ల్లో 9 వికెట్లు, కివీస్తో జరిగిన సిరీస్లో 2 మ్యాచ్ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 729 రేటింగ్ పాయింట్లు సాధించి టాప్ ర్యాంకుకు వచ్చాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ (727 పాయింట్ల)తో రెండోస్థానంలో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్ (708), మిచెల్ స్టార్క్ (665), రషీద్ ఖాన్ (659) తర్వాత స్థానాల్లో ఉన్నారు. కివీస్తో రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన మరో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన ర్యాంక్ను మెరుగుపర్చుకుని 11 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు.
మూడేళ్ల తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. అన్ని ఫార్మాట్లలోనూ రాణించాడు. సిరాజ్ గత 21 వన్డేల్లో 37 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే సిరాజ్కు 2022 ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులోనూ చోటు లభించింది. కెరీర్ ప్రారంభంలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్ కొత్తకాలంగా రాటుదేలాడు. ప్రస్తుతం కొత్త బంతిని అద్భుతంగా ఇరువైపులా స్వింగ్ చేయడంతోపాటు, ఆరంభ ఓవర్లు, మిడిల్ ఓవర్లలో అన్న తేడా లేకుండా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. గత 10 వన్డేల్లో సిరాజ్ ప్రతి మ్యాచ్లో కనీసం ఒక్క వికెట్ తీశాడు. పవర్ ప్లేలోనూ మెయిడిన్ ఓవర్లు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు.
బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లుకు స్థానం దక్కింది. కివీస్పై తొలి వన్డేలో డబుల్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీతో సహా మొత్తం 360 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుననాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోయాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ నంబర్ వన్గా ఉన్నాడు.