YSRCP : వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు మరో 14 నెలలు మాత్రమే సమయం ఉన్న ఈ తరుణంలో నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ విషయంలో కొందరు నేతలు ఇప్పటికే బహిరంగ విమర్శలకు దిగారు. తాజాగా విజయవాడలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటా మాటా పెరిగింది. ఇద్దరు తిట్ల దండకం అందుకోవడంపై వివాదం మరింత మరింత పెరిగింది.
వెల్లంపల్లి ఫైర్.. ఉదయభాను కౌంటర్ ఎటాక్..
వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ జన్మదినం సందర్భంగా పటమటలోని పార్టీ కార్యాలయానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అక్కడ వచ్చారు. ఉదయభాను ఎదురవగానే వెలంపల్లి ఆగ్రహంతో ఊగిపోయారు. తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత శ్రీనివాస్ను సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లడానికి నువ్వు ఎవరు? పోటుగాడివా అంటూ నిలదీశారు. పార్టీలో సీనియర్ లీడర్ను, నీలా పదవి కోసం పార్టీ మారలేదంటూ ఉదయభాను ఘాటుగా బదులిచ్చారు. ‘3 పార్టీలు మారిన ఊసరవెల్లివి నువ్వు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు నాకు చెప్పేదేంటి…’ అంటూ జగ్గయ్యపేట ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఈ సమయంలో అనుచరులు వారిని పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.
వివాదానికి కారణమిదే..!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాసరావు , బీజేపీ అభ్యర్థిగా వెలంపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆకుల కొంతకాలంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గతవారం ఉదయభాను తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడ ఆకుల శ్రీనివాసరావు ఎదురుపడ్డారు. ఈ నెల 28న తన కుమార్తె వివాహం ఉందని.. సీఎం జగన్కు ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చానని ఆకుల తెలిపారు. దీంతో ఉదయభాను తనతోపాటు శ్రీనివాసరావును సీఎం వద్దకు తీసుకువెళ్లారు. తన నియోజకవర్గానికి చెందిన నేతను ఉదయభాను సీఎం వద్దకు తీసుకెళ్లడంపై వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన టిక్కెట్ కే ఎసరు వస్తుందనే అనుమానం వెల్లంపల్లికి కలిగిందేమో మరి.
చాలాచోట్ల ఇదే పరిస్థితి..
మైలవరం టిక్కెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య వివాదం నడుస్తోంది. మళ్లీ టిక్కెట్ ఇవ్వడంపై వసంతకు సీఎం జగన్ నుంచి హామీ లభించలేదు. దీంతో మైలవరం ఎమ్మెల్యే ప్రభుత్వంపైనే నేరుగా విమర్శలు గుప్పించారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే , మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారతారనే ప్రచారం సాగింది. ఆమె తన భర్త ఎటు వెళితే అటే వెళ్తానని వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. సుచరిత టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి నుంచి తప్పించినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాల్లో అంతచురుగ్గా పాల్గొనడంలేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో వైసీపీలో లుకలుకలున్నాయి. టిక్కెట్ దక్కదనే అనుమానం ఉన్న నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది మరిన్ని వివాదాలు రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలను సీఎం జగన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.