Lokesh: ‘యువగళం’కు సిద్ధమయ్యారు నారా లోకేశ్. హైదరాబాద్ లోని ఇంటి నుంచి బయలు దేరారు. తొలుత తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరిలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు.. భార్య బ్రాహ్మణి.. నారా లోకేశ్ కు హారతి ఇచ్చి యువగళం యాత్ర దిగ్విజయంగా జరగాలని వీరతిలకం దిద్దారు. మామ బాలకృష్ణ దగ్గరుండి అల్లుడిని కారు ఎక్కించి సాగనంపారు.
తెలుగు యువత తోడు రాగా.. భారీ బైక్ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు లోకేశ్. యాత్రకు వెళ్లేముందు టీడీపీ వ్యవస్థాపకులు, తాత ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసానితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు లోకేశ్ వెంట ఉన్నారు.
హైదరాబాద్ నుంచి నేరుగా కడప జిల్లాకు వెళ్లి అక్కడ పలు ఆలయాలు, దర్గా, చర్చిలు సందర్శిస్తారు. రాత్రికి తిరుమల చేరుకుంటారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని.. యాత్రకు ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు నారా లోకేశ్. అనంతరం కుప్పం వెళతారు. అక్కడ శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
యువగళం పేరుతో 400 రోజుల పాటు లోకేష్ పాదయాత్ర జరగనుంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు మొత్తం 4 వేల కిలోమీటర్లు నడిచేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు.
అంతకుముందు పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పాదయాత్రకు పర్మిషన్ కోసం ఈనెల 9న డీజీపీకీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. అయితే ఈ నెల 20 వరకు డీజీపీ నుంచి స్పందన రాకపోవడంతో మరోసారి లేఖ ద్వారా పాదయాత్ర అనుమతి విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 9న రాసిన లేఖ అందిందని రూట్ మ్యాప్, కాన్వాయ్ వాహనాల జాబితా, పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలివ్వాలని డీజీపీ ఈ నెల 21న మెసెంజర్ ద్వారా ఒక లేఖను వర్ల రామయ్యకు పంపారు. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పాదయాత్రలో లోకేష్ ఎంతో మందిని కలుస్తారని.. వారందరి జాబితా ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులే తగ్గారు. జనవరి 27 నుంచి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు అనుమతి ఇచ్చారు.
అయితే, షరతులతో కూడిన అనుమతి మాత్రమేనంటూ చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రలో ప్రజలకు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాత్రకు రూట్ క్లియర్ కావడంతో.. యువగళం వినిపించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు యువనేత నారా లోకేశ్.