Republic Day: భారత గణతంత్ర దినోత్సవం. దేశానికే పెద్ద పండుగ. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం. ఊరూవాడా ఆసేతు హిమాచలం మువ్వన్నెల జెండా పండుగ అంతా ఘనంగా జరుపుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం రిపబ్లిక్ డే వేడుకలు రచ్చ రాజేస్తున్నాయి. మీకు మీరే మాకు మేమే.. ఎవరికి వాళ్లే అంటూ కేసీఆర్ సర్కారు వేరుగా ఉత్సవం జరుపుతామంటోంది. ఈ వేరు కుంపటి.. గవర్నర్ తమిళిసై స్థాయి తగ్గించడమేనంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటిదేమీ లేదంటూ సరకారు ఎంతగా కవర్ చేసుకుంటున్నా.. అంతా ఆమె టార్గెట్ గానే అనేది ఓపెన్ సీక్రెట్.
రాజ్భవన్లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. ఈ లేఖపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై అన్నారు. రాజ్భవన్లోనే గవర్నర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు.
రిపబ్లిక్ డే జగడంపై గవర్నర్ కు మద్దతుగా బీజేపీ నేతలు స్వరం పెంచారు. గవర్నర్ ను కేసీఆర్ సర్కారు పదే పదే అవమానిస్తోందని.. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.
అయితే, రిపబ్లిక్ డే ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ తనకు తాను అవమానం జరిగిందని అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రాజ్ భవన్ లో వేడుకలు జరుగుతాయని చెప్పారు. ప్రోటోకాల్ విషయంలోనూ ఎలాంటి ఉల్లంఘనలు జరగడం లేదని వివరించారు.
మరోవైపు, తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరిస్తోందని.. ప్రభుత్వం అధికారికంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించేలా పిటిషనర్లు కోర్టును కోరారు.