Republic Day : 74వ భారత్ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో జరిగే ఈ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రిపబ్లిక్ డే పరేడ్కు సంబంధించిన టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ పరేడ్ విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగుతుంది. రిపబ్లిక్ డే లో ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆయుధాలను ప్రదర్శిస్తారు. ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కో బృందం పరేడ్ లో పాల్గొంటాయి. సంప్రదాయ 21 గన్ సెల్యూట్కు ఉపయోగించే పురాతన బ్రిటిష్ పౌండర్ గన్స్ స్థానంలో 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ ను ఈసారి ఉపయోగిస్తారు. ఈజిప్ట్ నుంచి వచ్చిన ప్రత్యేక సైనిక పటాలం ఈ పరేడ్లో పాల్గొంటుంది. కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు ఈ పరేడ్లో భాగస్వాములవుతారు.
నారీశక్తి ప్రదర్శన..
ఆర్మీ సిగ్నల్ కోర్, ఎయిర్ డిఫెన్స్, ఆర్మీ డేర్ డెవిల్స్ విభాగాల నుంచి మహిళా అధికారులు మార్చ్లో పాల్గొంటారు. ఆకాశ్ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్ చేతన శర్మ నేతృత్వం వహిస్తారు. బీఎస్ఎఫ్ క్యామెల్ కంటెజెంట్లోని మహిళా సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ‘నారీశక్తి’ ప్రదర్శనలో భాగంగా నేవీలో 144 సెయిలర్స్ బృందానికి మహిళా అధికారిణులు నేతృత్వం వహిస్తారు.
హైలెట్స్..
రిపబ్లిక్ డే పరేడ్ కోసం నేవీకి చెందిన ఐఎల్-38 విమానం చివరిసారిగా గాల్లోకి ఎగరనుంది. ఈ విమానం 42 ఏళ్లుగా నౌకాదళానికి సేవలు అందించింది. రిపబ్లిక్ డే ఫ్లైపాస్ట్లో మొత్తం 44 విమానాలు పాల్గొంటాయి. 9 రఫేల్ జెట్ విమానాలు, దేశీయంగా తయారు చేసిన తేలికపాటి అటాక్ హెలీకాప్టర్లు ఫ్లైపాస్ట్లో పాల్గొంటాయి.
రాష్ట్రపతి ప్రసంగం..
రిపబ్లిక్ డేకు ముందురోజు ఏటా రాష్ట్రపతి మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. 74వ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి తన సందేశాన్నిఇస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రధాని మోదీ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తారు.