Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్సీఓ సదస్సులో పాల్గొనాలంటూ భారత్, పాకిస్థాన్కు ఆహ్వానం పంపించింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు ఆహ్వానం పంపించారు. పొరుగు దేశాలే ప్రధమ ప్రధాన్యం విధానంలో భాగంగా పాక్కు ఈ ఆహ్వానం పంపించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
గోవా వేదికగా మే 4,5 తేదీల్లో ఈ ఎస్సీఓ సమావేశం జరగనుంది. పాక్తో పాటు చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, తజకిస్థాన్ దేశాలకు భారత్ ఆహ్వానం పంపింది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ భారత్లో పర్యటించారు. అప్పటి నుంచి ఎవరూ భారత్లో అడుగుపెట్టలేదు. ఒకవేళ పాక్ ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. పాక్ విదేశాంగ మంత్రి భారత్కు రావడం 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే అవుతుంది.