Republic Day : భారత్ గణతంత్ర దినోత్సవాన్ని ఏటా జనవరి 26నే ఎందుకు నిర్వహిస్తారు? ఆ రోజే ఈ వేడుక చేయడానికి కారణాలేంటి? అసలు రిపబ్లిక్ డేను ఎందుకు నిర్వహిస్తారు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం..
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు..
భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక రాజ్యంగా మారిన రోజున దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
తొలి రిపబ్లిక్ డే వేడుక..
తొలి రిపబ్లిక్ వేడుక వేళ దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూరాజేంద్రప్రసాద్ చేసిన ప్రసంగం దేశప్రజల్లో అచంచల విశ్వాసం నింపింది. సత్యంతో, అహింసామార్గంలో ఈ సర్వసత్తాక, స్వతంత్ర రాజ్యాన్ని నిర్వహిద్దామంటూ భారతదేశ రాజ్యాంగంపై అధికార ముద్ర వేయడానికి ముందు ఆయన చేసిన ప్రసంగం జాతికి స్ఫూర్తినిచ్చింది. ఆనాటి నుంచి ఏటా జనవరి 26న రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
జనవరి 26నే ఎందుకు చేస్తారంటే..?
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని చేయడానికి చారిత్రక కారణం ఉంది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ దేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించింది. ఆ తర్వాత 17 ఏళ్ల తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం రూపొందించి 1949 నవంబర్ 26న ఆమోదించారు. జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించిన జనవరి 26నే రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత రెండు నెలలకు రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. అందుకే ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఏటా జనవరి 26న ఢిల్లీలో జరిగే సైనిక కవాతు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే సందర్భంగా మారింది. రిపబ్లిక్ డే కు ముందురోజు రాత్రి రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజు దేశ ప్రధాని సైనిక వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత దేశలకు సందేశాన్ని ఇస్తారు. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం.