Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాన్ వైకాపా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా కోరుకున్న హింసను తాము ఇవ్వలేమని అన్నారు. విశాఖ గర్జన ప్రకటించిన తరువాతే జనవాణి ప్రకటించామని పవన్ కళ్యాన్ అన్నారు. వైకాపాను కార్యక్రమాలకు ఇబ్బందులను గురిచేయాలని తామెప్పుడూ అనుకోలేదన్నారు.
మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఏ విమర్శలు చేసినా విధానపరంగానే ఉంటాయి గానీ వ్యక్తిగతంగా ఉండవన్నారు. వైకాపా నేతలు దాడులకు దిగితే అప్పటి డీజీపీ భావ స్వేచ్ఛ అన్నారని.. ఇప్పుడు మేము కేవలం మాట్లాడితే సెక్షన్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న పార్టీ విశాఖ గర్జన అని కార్యక్రమం పెట్టడమేంటని పవన్ ప్రశ్నించారు. క్రిమినల్స్కు ఐపీఎస్ ఆఫీసర్లు సెల్యూట్ చేసే దారుణ వ్యవస్థలో మనం ఉన్నామన్నారు. విశాఖ దసపల్లా భూములను ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమేంటన్నారు. ఉత్తరాంత్ర ప్రజలమీద నిజంగా ప్రేమ ఉంటే 71 ఎకరాలను ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందన్నారు. వైకాపా నేతల భూకబ్జాలు బయటపడతాయనే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారన్నారు.