Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి న్యాయపోరాటంతో ఈ కేసులో ఏపీ నుంచి తెలంగాణకు బదలీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలను హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు తరలించారు. ఛార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు, ఇతర దస్త్రాలను 3 ట్రంకు పెట్టెల్లో కడప జిల్లా సెషన్స్కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు. వివేకా హత్య కేసును ఢిల్లీ సీబీఐ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన ఛార్జిషీట్, దేవిరెడ్డి శంకర్రెడ్డిపై అనుబంధ ఛార్జిషీట్ను కడప జిల్లా సెషన్స్ కోర్టులో గతంలో సీబీఐ దాఖలు చేసింది. అయితే కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు వివేకా హత్య కేసును తెలంగాణ బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫైళ్లన్నీ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ చేర్చింది. ఛార్జిషీట్లు పరిశీలించాలని కోర్టు కార్యాలయాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు పరిశీలించి ఛార్జిషీట్కు నంబరు కేటాయించిన తర్వాత హైదరాబాద్లో విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
అవినాష్ రెడ్డి రియాక్షన్ ఇదే..
మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం విచారణకు హాజరవ్వాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల షెడ్యూల్స్ వల్ల విచారణకు హాజరు కాలేనని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు 5 రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు తప్పకుండా హాజరవుతానని స్పష్టంచేశారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వెల్లడించారు. గత రెండున్నర ఏళ్లుగా తనపై, తన కుటుంబపై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తనేమిటో జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.
దోషులకు శిక్ష పడాలి: షర్మిల
వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. తన బాబాయ్ హత్య కేసు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వివేకా మర్డర్ కేసుపై షర్మిల మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ విషయంలోనే వివేకా హత్య జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో షర్మిల స్పందించడం దోషులకు శిక్షపడాలని డిమాండ్ చేయడం ఆసక్తిని రేపుతోంది.