Ponguleti: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ మాజీ ఎంపీ. ఆయన రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ సీపీతోనే ఆరంభమైంది. జగన్ అనుచరుడిగా, బలమైన నాయకుడిగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ తరఫున ఎంపీగా ఎన్నికై సంచలనంగా నిలిచారు. వైసీపీ తరఫున తెలంగాణ ఎంపీగా అప్పట్లో ఆయన పేరు మారుమోగిపోయింది.
కట్ చేస్తే, జగన్ కంప్లీట్ గా ఏపీకి షిఫ్ట్ అవడంతో వైసీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు పొంగులేటి. అంతే. అదే అతని ఆఖరి పదవి. ఓసారి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచాక.. కేసీఆర్ ను నమ్ముకున్నాక.. ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశమే రాకుండా పోయింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కూడా శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వలేదు గులాబీ బాస్. ఖమ్మం ఎంపీ సీటు నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టి.. పొంగులేటిని పక్కనపెట్టేశారు.
అయినా గమ్మునున్నారు. కానీ, ఈసారి కూడా మళ్లీ తనకు టికెట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపించకపోవడంతో తిరుగుబాటు చేయక తప్పలేదు పొంగులేటికి. పుష్కలంగా ఆర్థిక బలం, కావాల్సినంత మంది అనుచరగణం.. ఉన్నాకూడా తనకు పోటీ చేసే అవకాశమే ఇవ్వట్లేదంటూ బీఆర్ఎస్ కు బై బై చెప్పేందుకు సిద్దమయ్యారు.
అందరిలానే ఆయనూ బీజేపీలోకి చేరుతారన్నారు. కాంగ్రెస్ సైతం రారమ్మంటూ పిలిచింది. స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే మీడియా సమావేశంలోనే ఓపెన్ గా వెల్ కమ్ చెప్పారు. అయినా, పొంగులేటి దారెటో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. బీజేపీలో చేరలేదు.. కాంగ్రెస్ కు వెళ్లేలా లేరు. ఇలాంటి సందిగ్థ పరిస్థితుల్లో సడెన్ గా ఆయన వైఎస్ షర్మిలను కలవడం.. కలకలం రేపుతోంది. పొంగులేటి YSRTPలోకి వెళ్తున్నారా? అంటూ ఒక్కసారిగా అటెన్షన్ క్రియేట్ అయింది.
ఇన్నాళ్లూ బీఆర్ఎస్ లో ఉన్నా.. వైఎస్ జగన్ తో బంధాన్ని అలానే కంటిన్యూ చేశారు పొంగులేటి. కొన్ని నెలల క్రితమే ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి మరీ జగన్ ను కలిసి చర్చలు జరిపొచ్చారు. లేటెస్ట్ గా ఇప్పుడు వైఎస్ షర్మిలతో శ్రీనివాస్ రెడ్డి భేటీ అవడం రాజకీయంగా ఆసక్తిగా మారింది.
ఇప్పటికే తాను పాడేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానంటూ షర్మిల ప్రకటించారు. ఇప్పుడు షర్మిలతో పొంగులేటి సమావేశం అయ్యారు? ఏంటి సంగతి అంటూ చర్చ నడుస్తోంది. ఈయన ఆమె పార్టీలో చేరుతారా? అంటూ గుసగుస నడుస్తోంది.
పొంగులేటి తాను సింగిల్ గా రానని.. తనతో పాటు నలుగురు ఐదుగురు అనుచరులు కూడా అసెంబ్లీ బరిలో దిగుతారని ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించారు. అన్నట్టుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. పొంగులేటి తనతో పాటు మరో నలుగురికి టికెట్లు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీతో ఆ విషయంలోనే తేడా కొట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఐదు సీట్లపై కమలనాథులు హామీ ఇవ్వలేదని.. అందుకే ఆయనింకా కాషాయ కండువా కప్పుకోలేదని చెబుతున్నారు. ఈ లోగా.. ఐదు కాదు.. ఎన్నంటే అన్ని సీట్లు ఇస్తానంటూ షర్మిల నుంచి ఆహ్వానం వచ్చిందని అంటున్నారు.
అసలే వైఎస్ కుటుంబం. ఆ ఫ్యామిలీతో పొంగులేటికి అనుబంధం. పిలిచి టికెట్లు ఇస్తానంటే వద్దంటారా? పోటీకి కాదంటారా? పార్టీలో చేరనంటారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీతో పని లేదు.. సొంతం బలం, బలగంతో గెలిచే సత్తా ఉన్న నాయకుడు. అందుకే, బీజేపీనే ఎందుకు YSRTP అయినా ఓకే అనే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ అయితే ఒకటో రెండు టికెట్లు.. షర్మిల పార్టీ అయితే ఖమ్మం మొత్తం తనదే అనే ఆఫర్. రెండిట్లో ఏదో ఒకటి.. త్వరగా తేల్చేస్తే ఆయనకే మంచిది అంటున్నారు.