Naveen Jindal : పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు బెదిరింపులు రావడం ఈ మధ్య బాగా పెరిగింది. ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని ఆగంతకులు బెదిరిస్తున్నారు. మరికొందరు లేఖలు రాసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కు ఓ వ్యక్తి బెదిరింపు లేఖ రాయడం కలకలం రేపింది. ఆ ఆగంతకుడు 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ లేఖపై దర్యాప్తు చేపట్టారు. నవీన్ జిందాల్ కు ఈ లేఖ రాసింది ఓ ఖైదీ అని నిర్ధారించారు.
ఛత్తీస్గఢ్ లోని పాత్రపాలిలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఫ్యాక్టరీకి గతవారం పోస్టు ద్వారా ఈ లేఖ వచ్చింది. నవీన్ జిందాల్ 48 గంటల్లోగా రూ.50 కోట్లు ఇవ్వాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ బెదిరింపు లేఖపై జిందాల్ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. బిలాస్పూర్ సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ ఈ లేఖ పంపినట్లు తేల్చారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పూర్తి వివరాలను మాత్రం పోలీసులు బయటపెట్టలేదు.
ఇటీవలి కాలంలో ప్రముఖులకు వరుస బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరిస్తూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. రూ.100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లోని గడ్కరీ కార్యాలయానికి ఒకే రోజు రెండు ఫోన్కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలోనూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఖైదీ అని దర్యాప్తులో తేలింది. ఓ హత్య కేసులో కర్ణాటకలోని బెళగావి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆ ఫోన్ చేసినట్లు గుర్తించారు. అలాగే నవీన్ జిందాల్ కు లేఖ రాసిన వ్యక్తి కూడా ఖైదీ అనే తేలింది. ఇలాంటి ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.