Telangana New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయ భవనం సిద్ధమవుతోంది. ప్రారంభోత్సవానికి వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. ఫిబ్రవరి 17 ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు కేసీఆర్ పుట్టిన రోజు కావడం విశేషం. కొత్త సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ పేరును ఖరారు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు. నూతన సచివాలయ పనులను సీఎం కేసీఆర్ తాజాగా పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్ , కేబినెట్, సీఎంవో, అధికారుల ఛాంబర్స్ ఏర్పాటు చేశారు.
సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముందు వేదపండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహిస్తారు. సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తారు. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ సీఎం నితీశ్కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా.బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరవుతారని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి తెలిపారు.
సచివాలయ భవనం ప్రారంభం తర్వాత సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతమైంది. ఈ సభను అంతకుమించి సక్సెస్ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆ దిశగా నేతలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. జాతీయస్థాయిలో బీఆర్ఎస్ సభకు ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తున్నారు. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శుంకుస్థాపన చేస్తారు. అదే రోజు సికింద్రాబాద్ పరడే గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత నాలుగు రోజులకే కేసీఆర్ బహిరంగ సభ జరగనుండటం ఆసక్తిని రేపుతోంది. బీజేపీ సభను మించేలా బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని గులాబీ నేతలు సంకల్పిస్తున్నారు.