USA: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఓవైపు తుపాకీ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కాల్పుల ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఈ ఏడాది తొలి 23 రోజుల్లోనే 36 ఘటనలు చోటుచేసుకున్నాయి. రోజుకు ఒక్క చోట అయినా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. కాలు బయట పెట్టాలంటేనే ఆలోచిస్తున్నారు.
గడిచిన 48 గంటల్లో నాలుగు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్లో ఓ డ్యాన్స్ క్లబ్ వద్ద దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 11 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఆత్మ హత్య చేసుకున్నాడు.
ఈ ఘటన మరువక ముందే ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్మూన్ బే ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఫామ్హౌస్లో జరిగిన ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది ఇలా ఉండగా సోమవారం తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన నందపు దేవ్శిష్ అనే విద్యార్థి మృతి చెందగా.. సాయి చరణ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
2022లో మొత్తం 647 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 44 వేల మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో జనాలు గాయాలపాలయ్యారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.