CBI: బిగ్ బ్రేకింగ్ న్యూస్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసుకు రావాలని నోటీసులో తెలిపింది. సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయం.. జగన్ కు బిగ్ షాక్ అని చెబుతున్నారు. అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి.
తన ఇంట్లో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్నా.. ఇంకా కేసు కొలిక్కి రాకపోవడంతో మరింత పకడ్బందీగా విచారించాలని డిసైడ్ అయినట్టుంది. వివేక హత్య కేసులో మొదటి నుంచీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. హత్య జరిగిన స్పాట్ లో రక్తపు మరకలు తుడిచేయించడం, ఆధారాలు ధ్వంసం చేయడం లాంటి చర్యలు చేశారంటూ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. వివేకాను గొడ్డలితో నరికి చంపినా.. శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నా.. ఆయన గుండెపోటులో చనిపోయారంటూ అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పడం అప్పట్లో కలకలం రేపింది.
వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని విచారించాలంటూ టీడీపీ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. వివేక కూతురు సునీత సైతం అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి సైతం తన వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డి పేరు ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ఇలా ఈ కేసులో అనేక చిక్కుముడులు ఎంపీ అవినాష్ రెడ్డి వైపే ఉండటంతో.. ఎట్టకేళకు ఆయన్ను కూడా విచారించాలని సీబీఐ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
మరి, నోటీసులు ఇచ్చిన సీబీఐ విచారణ దగ్గరే ఆగిపోతుందా? అరెస్టు చేసే అవకాశం ఉందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.