Sharukh Khan : షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొనే జంటగా నటించిన బాలీవుడ్ మూవీ పఠాన్ పై కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఈ సినిమాను అడ్డుకుంటామని కొందరు బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. పఠాన్’ చిత్రంలో బేషరమ్ పాటలో దీపికా పదుకొణె బికినీ దృశ్యాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వహిందూ పరిషత్, కొందరు బీజేపీ నేతలు ఆ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అస్సాంలోని గోహతిలో శుక్రవారం భజరంగ్ దళ్ కార్యకర్తలు ‘పఠాన్’ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఆ సినిమా పోస్టర్లను చింపేసి నిప్పుపెట్టి నిరసన చేపట్టారు.
ఈ పరిణామాలపై విలేకర్లు సీఎం హిమంత బిశ్వశర్మను ప్రశ్నించారు. ఆ సమయంలో సీఎం తనకు షారుఖ్ ఖాన్ ఎవరో తనకు తెలియదన్నారు. పఠాన్ చిత్రం గురించి తెలీదని చెప్పారు. ఈ సమస్యపై బాలీవుడ్ నుంచి అనేక మంది తనకు ఫోన్ చేశారని తెలిపారు. అయితే శాంతిభద్రతలను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటామని హిమంత స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం రాత్రి 2 గంటలకు షారుఖ్ ఖాన్ …హిమంత బిశ్వశర్మకు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా అస్సాం సీఎం ట్వీట్ చేశారు. గోహతిలో జరిగిన ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. శాంతిభద్రతల్ని కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని షారుక్ కు చెప్పానన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చానని సీఎం ట్వీట్ చేశారు.
అయితే షారుఖ్ ఖాన్ ఎవరు? ఆయన గురించి, ఆయన సినిమాల గురించి తనకు తెలియదని అస్సాం సీఎం వ్యాఖ్యానించిన మరుసటి రోజే షారుఖ్ ఖాన్ ఫోన్ చేయడం విశేషం. అదే విధంగా షారుఖ్ ఫోన్ చేసిన విషయాన్ని స్వయంగా సీఎం హిమంత బిశ్వశర్మే వెల్లడించారు. ఈ సినిమా ప్రదర్శనలకు భరోసా ఇచ్చారు.