bhupalpally BRS Fighting : భూపాలపల్లి నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూప్ పాలిటిక్స్ మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి వర్గీయులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవనం ప్రారంభోత్సవానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై మధుసూదనాచారి పేరు లేకపోవడంతో రగడ మొదలైంది.
ఎమ్మెల్యే గండ్ర కావాలనే శిలాఫలకంపై మధుసూదనాచారి పేరు లేకుండా చేశారని ఆయన వర్గీయులు వాగ్వాదానికి దిగారు. గండ్ర, మధుసూదనాచారి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరువర్గాల నాయకుల మధ్య మాట మాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. పలువురు కార్యకర్తలు పరస్పరం తోసేసుకున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. ఇరువర్గాల నాయకులకు సర్దిచెప్పి గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే మధుసూదనాచారి, గండ్ర వర్గీయులు రోడ్డున పడి కొట్టుకోవడం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.