Harish rao: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులు రూ.495 కోట్లను తిరిగి తెలంగాణకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 2014-15లో సీఎస్ఎస్ కింద తెలంగాణకు రావాల్సిన నిధులను పొరపాటున ఆంధ్రప్రదేశ్లో ఖాతాలో జమచేశారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని విన్నవించారు. గతంలో ఇదే అంశంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందనని హరీశ్ రావు అన్నారు. ఇప్పటికైనా స్పందించి నిధులను ఇప్పించాలని నిర్మల సీతారామన్ ను కోరారు.
రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాది 2014-15లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారు. అయితే పొరపాటున మొత్తంం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదం తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు..రాకుండా పోయాయని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర, ఏపీ ప్రభుత్వాలతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లామని.. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు.
8 సంవత్సరాలు గడుస్తున్నా.. రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని హరీశ్ రావు అన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్ను కోరారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేఖలో పేర్కొన్నారు.