Smita Sabharwal: ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ ఇంటి వద్ద ఓ డిప్యూటీ తహశీల్దార్ హల్చల్ చేశాడు. అర్థరాత్రి వారి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడిని చూసిన అధికారిని కేకలు వేయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తహశీల్దార్ ఆనంద్ గతంలో స్మితాసబర్వాల్ ట్వీట్లకు రీట్వీట్లు చేశాడు. ఈక్రమంలో తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని తీసుకొని అర్థరాత్రి స్మితాసబర్వాల్ నివాసానికి వెళ్లాడు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి ఓ క్వార్టర్స్కు వెళ్లాలని ఎటువంటి అనుమానం రాకుండా జంకు లేకుండా చెప్పడంతో వాళ్లను పంపించారు. ఆ తర్వాత ఆనంద్ తన స్నేహితుడిని కారులోనే ఉంచి స్మితాసబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డాడు.
అయితే అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తిని చూసిన స్మితాసబర్వాల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించారు. గతంలో తమ ట్వీట్లు రీట్వీట్లు చేశానని.. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని ఆనంద్ సమాధానం ఇచ్చాడు. దీంతో బయటకు వెళ్లాలంటూ స్మిత కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ వ్యవహారంపై స్మితాసబర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర స్థితిలో డయల్ 100కు ఫోన్ చేయాలి’’ అని ట్వీట్ చేశారు.