Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక నష్టాలతో సతమతమవుతోన్న ట్విట్టర్ను గట్టెక్కించేందుకు ఎలాన్ మస్క్ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించి, ట్విట్టర్ బ్లూ వంటి మార్పులను తీసుకొచ్చారు. అయినా కూడా నష్టాలు వెంటాడుతుండడంతో మరో కీలక ప్రకటన చేశారు మస్క్. ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు.
ట్విట్టర్లో ఇక ప్రకటనలు లేకుండా కొత్త సబ్స్క్రిప్షన్ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సబ్స్క్రిప్షన్ ధర మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండనున్నట్లు వెల్లడించారు. ఎవరైతే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొంటారో వారికి ఎటువంటి ప్రకటనలు ఉండబోవని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.