Rohit Sharma: రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్కు టీమిండియా చుక్కలు చూపించింది. భారత ఆటగాళ్లు తమ బౌలింగ్తో అదరగొట్టారు. మ్యాచ్ ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కివీస్ బ్యాటర్లను వణికించాడు. అయితే భారత బౌలర్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. టీమిండియా బౌలింగ్ గాడిన పడడం తమకు కలిసొచ్చే అంశం అని వెల్లడించాడు.
భారత బౌలర్లలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నాయని తెలిపాడు. గత ఐదు మ్యాచుల్లోనూ అద్భుత ప్రతిభ కనబర్చారని వెల్లడించాడు. జట్టులో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసం రెట్టింపైందని, జట్టును ఇలా చూడడం గొప్పగా ఉందని చెప్పాడు. తాను భారీ స్కోర్ చేయడం లేదనే విషయం తనకు తెలుసని.. ఈ విషయం గురించి తాను బాధపడడం లేదని అన్నారు. త్వరలో తన ఆట తీరును మార్చుకొని.. భారీ స్కోర్ను సాధిస్తానని వివరించాడు. ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నాడు.
ఇక రెండో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో భారత్ చేధించింది . దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులతో చెలరేగిపోయాడు. శుభ్మన్గిల్ (40*)తో నాటౌట్గా నిలిచాడు. కోహ్లీ 11, ఇషాన్ కిషన్ 8 పరుగులు చేశారు.