KTR: సోషల్ మీడియాలో కేటీఆర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు గ్రూపుల్లో తెగ షేర్లు చేస్తున్నారు. చాలామంది స్టేటస్లు కూడా పెడుతున్నారు. ఆ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కేటీఆర్ కు పవన్ ఫ్యాన్స్ కు లింకేంటంటే…
దావోస్ లో మంత్రి కేటీఆర్.. సూటు, బూటు వేసుకొని వరుస మీటింగులు అటెండ్ అవుతున్నారు. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. దావోస్ లో కేటీఆర్ కార్యక్రమాలు, అక్కడి వీడియోలను ఎడిట్ చేసి.. దానికి అత్తారింటికి దారేది సినిమాలోని ‘గగనపు వీధివీధి’ అంటూ సాగే పవన్ కల్యాణ్ సాంగ్ ను యాడ్ చేసి.. ఆ వీడియోను పబ్లిసిటీకి వాడేసుకుంటున్నారు. అదికాస్తా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
జస్ట్ పబ్లిసిటీ మాత్రమే కాదు.. నిజంగానే దావోస్ వేదికగా తెలంగాణకు 21వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారట కేటీఆర్. నాలుగు రోజుల పాటు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈవెంట్స్ కి హాజరయ్యారు. 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానల్ డిస్కషన్లకి అటెండ్ అయ్యారు.
పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ 16వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో మరో 3 డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. భారతీ ఎయిర్టెల్ గ్రూప్ 2వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో భారీ హైపర్స్కేల్ డేటా సెంటర్ను నిర్మించనుందని కేటీఆర్ అన్నారు.
ఫార్మా రంగానికి చెందిన యూరోఫిన్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో వెయ్యి కోట్లతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. పెప్సికో, పీఅండ్ జీ, అల్లాక్స్, అపోలో టైర్స్ లిమిటెడ్, వెబ్ పీటీ, ఇన్స్పైర్ బ్రాండ్స్ వంటి ఇతర అంతర్జాతీయ సంస్థలు 2వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించినట్టు కేటీఆర్ తెలిపారు.