KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆఖరులో శాసన సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అంతకంటే ముందే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ గులాబీ నాయకులు మాత్రం ముందస్తుకు వెళ్లే ఉద్దేశం లేదని బయటికి చెబుతున్నా.. లో లోపల మాత్రం.. ఎన్నికలకు గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నట్లు అర్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న పదోన్నతులకు కేసీఆర్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈ మేరకు మార్చి 4 వరకు మొత్తంగా 37 రోజుల పాటు పదోన్నతులు బదిలీల ప్రక్రియ కొనసాగేలా అధికారులు షెడ్యూల్ను రూపొందించారు. పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నా పెద్దగా పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం… ఉన్నట్టుండి ఒక్కసారిగా నిర్ణయాన్ని ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచింది.
మరో వైపు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం పనులు దాదాపు పూర్తికావచ్చాయి. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సచివాలయానికి సమీపంలోనే నిర్మిస్తున్న 125 అడుగులు భారీ అంబేడ్కర్ విగ్రహం పనులు కూడా మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏప్రిల్లో అంబేడ్కర్ జయంతి నాటికి విగ్రహాన్ని ప్రారంభించాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. మరో వైపు నియోజకవర్గాల్లోనే పెండింగ్ పనులను పూర్తయ్యేలా ఫోకస్ పెట్టాలని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ పెద్దలు పూరమాయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితిని… భారత రాష్ష్ర సమితిగా మార్చిన తర్వాత.. గులాబీ బాస్ పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. పార్టీ బలహీనంగా ఉందని భావిస్తున్న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించి సత్తా చాటారు. ఈ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ను రప్పించి.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు, దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం వేస్తున్న అడుగులను పరిశీలిస్తుంటే ముందుస్తుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ముందస్తుకు వెళ్తే.. బీఆర్ఎస్ కు రాజకీయంగా కలిసి వస్తుందన్న అంచనాలో నేతలు ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండడంతో.. అక్కడ ఎంతో కొంత ఆ పార్టీపై వ్యతిరేకత ఉంటుంది.. దానిని అధిగమించి.. మళ్లీ అధికారం నిలుపుకోవడానికి కమలం పార్టీ పెద్దలు కర్నాటకపైనే ఫోకస్ ఫెడతారని.. ఇది తెలంగాణలో తమకు రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ తరపున ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి సమయం దొరుకుతుందని నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ముందుస్తుకు వెళ్తేనే బెటర్ అన్న.. వాదన గులాబీ పార్టీలో రోజు రోజుకు పెరుగుతోందని చెప్పవచ్చు.