IND vs NZ: రాయపూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలోనే చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
లక్ష్యం చిన్నదే కావడంతో భారత ఆటగాళ్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులతో చెలరేగిపోయాడు. శుభ్మన్గిల్ (40*)తో నాటౌట్గా నిలిచాడు. కోహ్లీ 11, ఇషాన్ కిషన్ 8 పరుగులు చేశారు. కివీస్ ఆటగాడు షిప్లే, శాంటర్న్ చెరో వికెట్ తీశారు. నామమాత్రమైన మూడో వన్డే ఈ నెల 24న ఇండోర్లో జరగనుంది.
అంతకుముందు.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసి కుప్పకూలిపోయారు.
న్యూజిలాండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రాస్వెల్ (22), మిచెల్ శాంటర్న్ (27) పరుగులు చేశారు. షమీ, సిరాజ్కు తోడు ఆల్రౌండర్లు హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ వికెట్లు తీయడంతో కివీస్ కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుందర్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి కివీస్ను దెబ్బకొట్టాడు.