Swati: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ను ఓ వ్యక్తి వేధించిన వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై స్వాతి మలివాల్ భగ్గుమన్నారు. బెదిరింపులకు తాను బయపడనని స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడ్డానని చెప్పారు. తనపై ఎన్నో దాడులు జరిగినప్పటికీ తన ప్రశ్నించే గొంతుకను ఆపలేదని వెల్లడించారు. అవే తనలో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచాయని తెలిపారు.
అసలేం జరిగిందంటే?
ఇటీవల ఢిల్లీలో మహిళా భద్రతను పర్యవేక్షించేందుకు స్వాతి మలివాల్ అర్థరాత్రి రోడ్డు పక్కన నిలబడ్డారు. ఈక్రమంలో ఓ వ్యక్తి కారులో వచ్చి ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు, కారులోకి ఎక్కాలని బలవంతం చేశాడు. వెంటనే స్వాతి మలివాల్ అతడిని కారులోంచి బయటకు లాగే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చేయి కారు లోపల ఉండగానే ఆ వ్యక్తి కారు అద్దాలను ఎక్కించి లాక్కెళ్లాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీలో మహిళా చైర్ పర్సన్కే భద్రత లేదని, ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని స్వాతి మలివాల్ ప్రశ్నించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అయితే ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ.. స్వాతి మలివాల్ వేధించిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాడేనని వెల్లడించింది. స్వాతి మలివాల్ ఆప్తో కలిసి ఢిల్లీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ వీడియోను చిత్రీకరించినట్లు ఉందని ఆరోపించింది.
దీంతో ట్విట్టర్ వేదికగా బీజేపీపై స్వాతి మలివాల్ మండిపడ్డారు. తనను ఎవరూ ఆపలేరని, బతికి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.