Pune: టెక్నాలజీ దినదినా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరు మూఢనమ్మకాలను మాత్రం వీడడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మూఢనమ్మకాల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు తాంత్రికుల తప్పుడు మాటలు నమ్మి నరబలి, జంతుబలులు ఇస్తున్నారు. తాజాగా పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ చేత స్మశానంలో ఎముకలు తినిపించారు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పుణెకు చెందిన ఓ మహిళకు పెళ్లై ఐదు సంవత్సాలు గడిచినా సంతానం కలగ లేదు. దీంతో ఆమె భర్తతో పాటు, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. నిత్యం సూటిపోటి మాటలతో వేధించారు. పలుమార్లు తాంత్రికుడితో క్షుద్ర పూజలు కూడా నిర్వహించారు. ఇటీవల నరబలి, జంతుబలి ఇచ్చే ఓ మాంత్రికుడితో అర్థరాత్రి స్మశానంలో తాంత్రిక పూజలు చేయించారు. బాధిత మహిళను బలవంతంగా పూజలో కూర్చోబెట్టి ఆమె చేత మనుషుల అస్థికలను తినిపించారు.
భర్త, కుటుంబ సభ్యుల ఆగడాలతో విసిగి పోయిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు భర్త, కుటుంబ సభ్యులు, తాంత్రికుడితో సహా వారికి సహకరించిన మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.