Vande Bharat Express : వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆధునిక సౌకర్యాలు, స్పీడ్ ఎక్కువ, ప్రయాణికులకు సమయం ఆదా. టిక్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నా ఈ ట్రైన్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై వరసగా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బిహార్ కటిహార్లో కొందరు దుండగులు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దాడి చేశారు. శనివారం ఉదయం వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది. బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్ వెళ్తుండగా వందే భారత్ రైలుపై దాడి జరిగింది. ఆ రాష్ట్రంలో రెండోసారి ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై జరిగిన దాడిలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. బోగి సీ6 అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత కొంతసేపు రైల్ సర్వీసులకు ఆటంకం కలిగిందని తెలిపారు. రైలుపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల విశాఖపట్నంలో వందేభారత్ రైలు ట్రైల్ రన్ చేస్తుండగా కొందరు దుండగులురాళ్లు రువ్వారు. ఈ రైళ్ల ప్రారంభించినప్పటి నుంచి తరచూ ఏదో ఒక ఘటన జరుగుతోంది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన కొత్తలో పశువులను ఢీకొట్టాయి. కొన్ని రోజుల వ్యవధిలో రెండుమూడు ఘటనలు జరిగాయి. ఆ తర్వాత రాళ్ల దాడుల ఘటనలు తరచూ జరగుతున్నాయి. వందేభారత్ రైళ్లనే దుండగలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి చర్యలు జరగకుండా రైల్వేశాఖ పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.