Russia Goa Flight : రష్యా-గోవా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో రష్యా నుంచి బయల్దేరిన విమానాన్ని దారి మళ్లించినట్లు గోవా పోలీసులు తెలిపారు. 240 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి బయల్దేరిన అజుర్ ఎయిర్ విమానం శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు దక్షిణ గోవాలోని డబోలిమ్ ఎయిర్పోర్టుకు రావాల్సి ఉంది. అయితే ఈ విమానం భారత గగనతలంలోకి రాకముందే బాంబు బెదిరింపు వచ్చింది.
అజుర్ ఎయిర్ విమానంలో బాంబు ఉన్నట్లు డబోలిమ్ ఎయిర్పోర్టు డైరెక్టర్కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు. అయితే అప్పటికి విమానం ఇంకా భారత గగనతలంలోకి రాలేదు. దీంతో విమానాన్ని ఉజ్బెకిస్థాన్కు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
కొన్నిరోజుల క్రితం మాస్కో నుంచి గోవాకు వస్తుండగా అజుర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్పుడు అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అప్పటికే విమానం భారత్ గగనతలంలోకి రావడంతో గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్లోని జామ్నగర్కు మళ్లించారు. అక్కడే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు విమానానికి బాంబు బెదిరింపు సమాచారం రాగానే NSG సిబ్బంది అలెర్ట్ అయ్యారు. అత్యవసర ల్యాండింగ్ అయిన విమానం వద్దకు చేరుకుని లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానంలో అణువణువు గాలించారు. ఎన్ఎస్జీ సిబ్బందికి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. చివరకు విమాన క్యాబిన్ లోని మొత్తం లగేజ్ ను తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదని తేల్చారు. తనిఖీలన్నీ పూర్తైన విమానాన్ని జామ్నగర్ నుంచి గోవాకు పంపారు. ఇలా కొన్ని రోజుల వ్యవధిలోనే రెండుసార్లు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది.