Veerabhadra swamy-KottaKonda : హనుమకొండ జిల్లాలోని కొత్తకొండలో కొలువుదీరిన వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారం. రుద్రాంశ సంభూతుడైన స్వామిని కొలిస్తే కోరింది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. తెలంగాణలోనే ఎత్తైన ఆలయాల్లో ఒకటి కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామి వారు విగ్రహ రూపంలో కాకుండా అర్చామూర్తిగా కోరమీసాలతో వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సంక్రాంతి సందర్భంగా వీరభద్రుడి సన్నిధిలో మూడు రోజులపాటు జాతర ఘనంగా జరుగుతుంది. భోగి ముం దురోజు రాత్రి నుంచే అందంగా ముస్తాబుచేసిన ప్రభ బండ్లు కొత్తకొండకు తీసుకువస్తారు. భోగినాడు వీరబోనం సమర్పిస్తారు. కనుమ నాడు సాయంత్రానికి ప్రభ బండ్లు తిరుగుముఖం పడతాయి. ఐదు శతాబ్దాలుగా కొత్తకొండలోఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. శాలివాహన కులానికి చెందిన దామెరుప్పుల వంశస్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రభ బండ్లను తిప్పుతూ, ప్రత్యేక పూజలు చేయడం ఆచారంగా వస్తోంది.
పిల్లల భవిష్యత్తు, చదువు, ఉద్యోగం, పెళ్లిళ్లు , కొత్తఇల్లు.. ఇలాఎన్నో కోరికలు నెరవేరితే బండి కడతామని భక్తులు మొక్కుకుంటారు. భక్తులు వీరభద్రుడిని తమ ఇంటి మనిషిగా భావిస్తారు. పిల్లలకు కొత్తకొండయ్య, వీరభద్రం అనే పేర్లను పెట్టుకుంటారు. బండ్లు కట్టేవాళ్లతోపాటు వేలాదిగా సాధారణ భక్తులు వీరభద్రుడి దర్శనానికి వస్తుంటారు. స్వామివారికి వెండి కోరమీసాలు సమర్పిస్తుంటారు.
Follow this link for more updates:- Bigtv