Tax Notices : ఏపీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న రిపోర్టర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వృత్తిపన్ను కట్టాలంటూ నోటీసులు పంపింది. పాత బకాయిలు సహా రూ.12,500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న విలేకర్లకు ఈ నోటీసులు అందాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీసులు చూసి వారు షాక్ తిన్నారు. ఎన్నో ఏళ్లుగా విలేకర్లుగా పనిచేస్తున్నా… గతంలో ఎన్నడూ వృత్తి పన్ను చెల్లించలేదని అంటున్నారు. ఇప్పుడు ఈ బాదుడేంటని ప్రశ్నిస్తున్నారు.
వృత్తిపన్ను చెల్లించాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న 28 మంది విలేకర్లకు ఈ నెల 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు ఏటా రూ.2,500 చొప్పున మొత్తం రూ.12,500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న విలేకర్లు వాణిజ్యపన్నుల అధికారి సుబ్బారావును కలిశారు. నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డులు ఉన్న రిపోర్టర్ల నుంచి వృత్తిపన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన వారికి వివరించారు. అందుకే నోటీసులు జారీ చేశామని సమాధానం చెప్పారు.
రిపోర్టర్లకు వృత్తిపన్ను మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు డిమాండు చేశాయి. సరైన వేతనాలు లేక ఉద్యోగ భద్రత కరవై ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో పన్ను కట్టాలని నోటీసులివ్వడం సరికాదంటున్నారు పాత్రికేయులు. గతంలో రాజంపేటలోనూ ఇదే విధంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్లు ఆందోళనలు చేయడంతో నోటీసులు వెనక్కి తీసుకుంది. మళ్లీ కోనసీమలో ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ఏపీలోని వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న రిపోర్టర్లు ఆందోళన చెందుతున్నారు.
అసలే ఏపీలో ప్రతిపక్షాలు.. ప్రభుత్వం పన్నులు బాదుతోందని విమర్శలు చేస్తున్నాయి. బాదుడే బాదుడు లాంటి కార్యక్రమాలు నిర్వహించి నిరసనలు తెలిపాయి. ఎన్నికలకు మరో 14 నెలల సమయమే ఉన్న ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలతో వ్యతిరేకతను మూటగట్టుకుంటుందా ? ప్రతిపక్షాలు ఆందోళన చేయడానికి ఇలాంటి ఆయుధాలు ఇస్తుందా? మరి ప్రభుత్వం నోటీసులు వెనక్కి తీసుకుంటుందా? తగ్గదేలేదు అంటూ పన్ను కట్టాల్సిందేనని చెబుతుందా? చూడాలి.
AP: జగన్ కు షాక్.. జీవో నెం.1పై సుప్రీంలో చుక్కెదురు..
Byreddy: రంగం సినిమాలో విలన్ లా పవన్.. బైరెడ్డి ఆన్ ఫైర్.. జనసైన్యం అటాక్