Google: ఆండ్రాయిడ్ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న కేసులో… సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో గూగుల్ దిగివచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత… యాంటీ ట్రస్ట్ బాడీతో సహకరిస్తామని ప్రకటించింది. సుప్రీం నిర్ణయానికి సంబంధించిన వివరాలను సమీక్షిస్తున్నామని, తమ వినియోగదారులు, భాగస్వాములకు కట్టుబడే ఉన్నామని… ఈ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో సీసీఐకి సహకరిస్తామని గూగుల్ తెలిపింది.
ప్లే స్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్ యాప్స్ అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస్తోందని… గత అక్టోబర్లో సీసీఐ రెండు దఫాలుగా గూగుల్కు రూ.2,274 కోట్ల జరిమానా విధించింది. దీనిపై మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను గూగుల్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. గూగుల్ విజ్ఞప్తిపై విచారణ చేపట్టడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు… సీసీఐ విధించిన జరిమానాలో 10 శాతం మొత్తాన్ని జమ చేసేందుకు గూగుల్కు 7 రోజుల గడువు ఇచ్చింది. సీసీఐ ఆదేశాలపై గూగుల్ చేసిన విజ్ఞప్తికి సంబంధించి ఈ ఏడాది మార్చి 31లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్సీఎల్ఏటీకి సుప్రీం ధర్మాసనం సూచించింది. గురువారం నుంచి మూడు పనిదినాల్లోగా ఎన్సీఎల్ఏటీని గూగుల్ సంప్రదించాలని ఆదేశించింది. దాంతో, దిగొచ్చిన ఆ సంస్థ… యాంటీట్రస్ట్ బాడీతో సహకరిస్తామని తెలిపింది.
ఒక యాప్ అభివృద్ధి చేసిన డెవలపర్… అది యూజర్లకు చేర్చాలంటే యాప్ స్టోర్ పైనే ఆధార పడాలి. మన దేశంలో ఎక్కువగా వాడుతున్నవి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లే. దీంతో యాప్ డెవలపర్లు యూజర్లకు తమ యాప్ అందుబాటులోకి తీసుకురావాలంటే… గూగుల్ ప్లే స్టోర్ మీద ఆధార పడటం తప్ప వేరే దారి లేదు. ప్లే స్టోర్లో యాప్ లిస్ట్ చేయాలంటే గూగుల్ నిబంధనలకు తలొగ్గడంతో పాటు… గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ను అనుసరించాలి. ఇది గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేయడమేనని భావించిన సీసీఐ… గూగుల్కు భారీగా జరిమానా వడ్డించింది.