What are the causes of Alzheimer’s? : అల్జీమర్స్ వ్యాధి అనేది వృద్ధాప్యం వచ్చిన వారిలో కామన్గా కనిపిస్తోంది. అయితే దీనికి పూర్తిగా ఓ పరిష్కారం అనేది కనిపెట్టడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా కొత్త రకమైన ఇమేజింగ్ టెక్నాలజీతో అల్జీమర్స్పై కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు బెక్మాన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు.
ఇమేజింగ్ టెక్నాలజీతో అల్జీమర్స్పై అయిదేళ్ల పాటు పరిశోధనలు చేపట్టనున్నట్టు ఓ శాస్త్రవేత్త బయటపెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ ప్రాజెక్ట్ కోసం 3 మిలియన్ డాలర్లు పరిశోధకులకు అందజేసింది. ముందుగా అల్జీమర్స్ వ్యాధి ఏ వయసులో ఎలా వస్తుంది అనేదానిపై ఈ ప్రాజెక్ట్ దృష్టిపెట్టనుంది.
జన్యు సమస్యల వల్ల అల్జీమర్స్ వస్తుందని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. కానీ ప్రతీ జన్యు సమస్య అల్జీమర్స్కు దారితీయకపోవచ్చని వారు భావిస్తున్నారు. అయితే వృద్ధాప్యంలో ఒకరికి అల్జీమర్స్ వస్తుందా లేదా అని యవ్వనంలో ఉన్నప్పుడే తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. ఇది చాలావరకు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు.
అల్జీమర్స్ వ్యాధి గురించి శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా.. ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉందా లేదా అనేదానిపై వారు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. అందుకే వారు మిస్ అయిన అంశాలను వెతికి ఈ విషయంపై పరిశోధనలు మొదలుపెట్టనున్నారు. మామూలుగా ఉన్న మెదడుకు, అల్జీమర్స్ వచ్చిన మెదడుకు తేడా ఏంటని వారు తెలుసుకోనున్నారు. ముందుగా తేడా కనుక్కుంటే ఆ తర్వాత దానికి పరిష్కారం కనుగొనడం సులభంగా అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఎమ్మారై, ఎమ్మెస్సై ఇమేజింగ్ వల్ల అల్జీమర్స్ గురించి కొంతవరకు అవగాహన వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెండిటిని కలిపి పరీక్షించడం వల్ల మెదడులోని ప్రతీ చిన్న సెల్ను క్షుణ్ణంగా పరీక్షించే అవకాశం ఉంటుంది.