TTD: తిరుమల ఆలయంపై నో ఫ్లై జోన్ ఆంక్షలు ఉన్నాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. ఆలయం మీద నుంచి విమానాలు వెళ్లడానికి కూడా పర్మిషన్ లేదు. అలాంటిది, ఆలయం డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపుతోంది. ఆలయం మీదుగా డ్రోన్ కెమెరా ఎగురుతూ తీసినట్టుగా ఉంది ఆ వీడియో.
డ్రోన్ కెమెరాతో షూట్ చేసినా.. టీటీడీ విజిలెన్స్ గుర్తించలేదంటూ.. ఇది పక్కా భద్రతా వైఫల్యమేనంటూ సోషల్ మీడియాలో టీటీడీపై విమర్శలు వస్తున్నాయి. శ్రీవారి ఆలయం ఎదుట గొల్లమండపంపై, శ్రీవారి ఆలయంపైన నిరంతరం భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది. అలాంటిది భద్రతా సిబ్బంది ఎవరూ ఈ డ్రోన్ చిత్రీకరణను గుర్తించలేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వీడియోతో ఉలిక్కిపడిన టీటీడీ వెంటనే అప్రమత్తమైంది. తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాతో షూట్ చేసిన వీడియో నిజమైందా? కాదా? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ టీమ్ తో వీడియోను తనిఖీ చేస్తున్నారు. గతేడాది నవంబర్లో ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టు గుర్తించారు. పూర్తిస్థాయిలో తనిఖీచేసి ఈ వీడియో అసలైందా? నకిలీదా? అని గుర్తించి బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది టీటీడీ.
మరోవైపు, ఆ వీడియో డ్రోన్ తో చిత్రీకరించింది కాకపోవచ్చని.. గూగుల్ లొకేషన్ వీడియో కావొచ్చని అన్నారు ఈవో ధర్మారెడ్డి. కానీ, వీడియో చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు. డ్రోన్ తో తీసినట్టే ఉందంటున్నారు భక్తులు.