Congress: ఎన్నాళ్లో వేచిన భేటీ. ఇన్నాళ్లూ నిప్పు-ఉప్పుగా ఉన్న ఆ ఇద్దరు. వారిని ఒక దరికి చేర్చింది గాంధీభవన్. ఆ మేరకు చొరవ తీసుకున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే. అలా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల సమావేశం కుదిరింది.
హాత్ సే హాత్ జోడో.. కార్యక్రమం సక్సెస్ చేయడంపై ఆ ఇద్దరు నేతలు చర్చించారు. కలిసి పనిచేద్దామని అనుకున్నారు. ఇన్నాళ్లూ రేవంత్ పై రెబెల్ వాయిస్ వినిపించిన కోమటిరెడ్డి.. ఇప్పుడిలా కూల్ గా చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత, కాంగ్రెస్ ఇంఛార్జ్ థాక్రేనూ కలిశారు వెంకట్ రెడ్డి.
థాక్రే గత పర్యటనకు కోమటిరెడ్డి డుమ్మా కొట్టడం అప్పట్లో కలకలం రేపింది. తాను గాంధీభవన్ కు రానని.. రెండుమూడు సార్లు ఓడిపోయిన నేతలతో కలిసి కూర్చోనంటూ పార్టీ ఆఫీస్ గడప కూడా తొక్కలేదు వెంకట్ రెడ్డి. కావాలంటే బయట కలుస్తానంటూ మెసేజ్ పంపించారు. అలాంటి ఆయన తాజాగా గాంధీభవన్ కు రావడం.. రేవంత్ ను, థాక్రేను కలవడం ఆసక్తికర పరిణామంగా మారింది.
అయితే, థాక్రే ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పారట కోమటిరెడ్డి. పార్టీ కమిటీల్లో తాను సూచించిన వారికి పదవులు ఇవ్వలేదని.. తనకు కూడా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని ఫిర్యాదు చేశారు. పార్టీలో సరైన గౌరవం దక్కాలని.. అందరిని సంప్రదించి సమిష్టి నిర్ణయాలు ఉండాలని సూచించారు. ఇలా జరిగితే తాను మరింత ఉత్సాహంగా పని చేస్తానన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మరోవైపు, గాంధీభవన్ నుంచి అలిగి వెళ్లిపోయారు సీనియర్ మోస్ట్ లీడర్ వి.హనుమంతరావు. థాక్రేను కలిసి తాను ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నీకి రావాలని ఆహ్వానించారు వీహెచ్. అయితే, ఆ రోజు థాక్రే షెడ్యూల్ బిజీగా ఉందంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ జోక్యం అడ్డుతగిలారు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీభవన్ నుంచి అలిగి వెళ్లిపోయారు.
ఇలా ఒకరి కలయిక, మరొకరి అలక.. కాంగ్రెస్ కలహాల కాపురానికి గాంధీభవన్ మరోసారి వేదికైంది.