Modi: తమకు ఇష్టమైన వ్యక్తులపై ఉన్న అభిమానాన్ని కొందరు వినూత్న రీతిలో చాటుకుంటుంటారు. కొందరు బహుమతులు ఇస్తే.. మరికొందరు ఇతర పద్ధతుల్లో వ్యక్తపరుస్తుంటారు. తాజాగా గుజరాత్కు చెందిన ఓ స్వర్ణకారుడు ప్రధాని మోదీపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో వ్యక్తపరిచాడు. ఏకంగా బంగారంతో మోదీ విగ్రహాన్ని రూపొందించాడు.
సూరత్కు చెందిన సందీప్ జైన్ అనే స్వర్ణకారుడు 156 గ్రాముల మేలిమి బంగారాన్ని ఉపయోగించి ప్రధాని మోదీ విగ్రహాన్ని అద్భుతంగా మలిచాడు. దాదాపు 20 మంది స్వర్ణకారులు నెల రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహ తయారీకి రూ. 11 లక్షల వరకు ఖర్చు పెట్టామని సందీప్ జైన్ తెలిపాడు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లకు గానూ 156 స్థానాల్లో గెలుపొందినందుకు గుర్తుగా 156 గ్రాముల బంగారంతో మోదీ విగ్రహాన్ని తయారు చేశామని వెల్లడించాడు.
ఇటీవల ఈ బంగారు విగ్రహాన్ని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. చూపరులను ఈ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొందరు ప్రేక్షకులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.