Fire Accident: మామూలు అగ్ని ప్రమాదం కాదు. హైదరాబాద్ లో జరిగిన అతిపెద్ద దుర్ఘటన. గురువారం ఉదయం 11 గంటలకు చెలరేగిన మంటలు.. రాత్రి 9 గంటల వరకు మండుతూనే ఉన్నాయి. శుక్రవారం నాటికి మంటలు దగ్గినా.. నిప్పు మాత్రం ఆరలేదు. అంతా ప్లాస్టిక్, ఫోమ్, కెమికల్ మెటీరియల్ కావడంతో.. 30 ఫైర్ ఇంజిన్ల నీళ్లకు, కెమికల్ స్ప్రేలకు అగ్నికీలలు లొంగలేదు.
మంటల వేడికి.. బిల్డింగ్ స్లాబ్, పిల్లర్స్ కరిగిపోయాయి. చాలా చాలా వీక్ అయ్యాయి. ఎప్పుడు కూలుతుందో తెలీని పరిస్థితి. దానంతట అదే కూలితే.. పక్కనున్న భవనాలకూ ప్రమాదం. అందుకే, ప్రభుత్వమే కాలిపోయిన ఆ బిల్డింగ్ ను కూల్చేయాలని డిసైడ్ అయింది. వరంగల్ నుంచి నిట్ డైరెక్టర్ ను రప్పించారు. భవనాన్ని పరిశీలించిన ఆయన.. బిల్డింగ్ వీక్ గా ఉందని తేల్చేశారు. ఎలా కూల్చాలనే దానిపై నివేదిక ఇస్తానన్నారు.
భవనాన్ని ఒకేసారి కూల్చేస్తే పక్కనున్న బిల్డింగ్ లు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే, కూల్చివేతల్లో అనుభవం ఉన్న ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులను తీసుకొచ్చి భవనాన్ని చూపించారు. ఒకేసారి కాకుండా.. కొద్దికొద్దిగా నాలుగైదు రోజుల్లో కూల్చేసేలా ఆలోచన చేస్తున్నారు.
ఇక, శుక్రవారం మధ్యాహ్నం కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో స్వల్పంగా మంటలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఆర్పేస్తున్నారు. భవనం బాగా దిబ్బతినడంతో.. అధికారులు ఎవరూ లోనికి వెళ్లే సాహసం చేయట్లేదు. అందుకే, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు డ్రోన్ ఉపయోగించారు. డ్రోన్ తో బిల్డింగ్ లోపలి పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో మాల్ లో 17 మంది ఉన్నారని.. మంటలు చెలరేగగానే.. వారంతా బయటకు వచ్చారని అధికారులు చెబుతున్నాయి. దుకాణంలో ఉన్న సామాను తీసుకురావడానికి మళ్లీ లోపలికి వెళ్లి ముగ్గురు చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఆ ముగ్గురూ.. గుజరాత్లోని సోమనాథ్ జిల్లా వెరావల్ గ్రామానికి చెందిన జునైద్(25), జహీర్(22), వసీం(32)లని అంటున్నారు. ఈ ముగ్గురి పరిస్థితి గురించి కూడా అధికారులు డ్రోన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు బతికుండే అవకాశం లేదంటున్నారు. కనీసం డెడ్ బాడీ అవశేషాలైనా దొరుకుతాయేమోనని డ్రోన్ తో పరిశీలిస్తున్నారు.
షాపింగ్మాల్లో జరిగిన అగ్నిప్రమాదంకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ శాఖ తెలిపింది. మంటలు వ్యాపిస్తున్న సమయంలో భవనంలో విద్యుత్ సరఫరా ఉందన్నారు. ఒకవేళ షార్ట్ సర్య్కూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవని.. సబ్ స్టేషన్లో ట్రిప్ అయ్యేదని.. కానీ అలా జరగలేదని అంటున్నారు. మరి, షార్ట్ సర్క్యూట్ కాకపోతే.. అగ్నిప్రమాదం ఎలా జరిగినట్టు? అనేది మరింత మిస్టరీగా మారనుంది. మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచీ బిల్డింగ్ యజమాని జావేద్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.