AP: కోర్టులు జగన్ కు గానీ, ఏపీ సర్కారుకు గానీ అంతగా కలిసిరావు. న్యాయస్థానాలతో పదే పదే మొట్టికాయలు తినడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఏపీ హైకోర్టు ముందు పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు చేతులు కట్టుకుని నిలబడాల్సి రావడం, శిక్షలు కూడా పడటం దారుణం. తాజాగా, జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పైనా కోర్టులు అక్షింతలు వేస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు ఆ జీవో పై స్టే విధించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. విచారణకు నిరాకరించింది. కేసు మళ్లీ ఏపీ హైకోర్టులోకే వచ్చి పడింది.
కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటను కారణంగా చూపించి.. ఏపీలో రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నియంత్రణ కోసం జీవో నెంబర్ 1ను జారీ చేసింది ప్రభుత్వం. అయితే, ఈ జీవో ప్రతిపక్షాలను అడ్డుకోవడానికే అనేది ఆరోపణ. వైసీపీ వర్గీయులు ర్యాలీలు తీస్తుంటే అభ్యంతరం చెప్పని పోలీసులు.. కుప్పంలో చంద్రబాబు పర్యటనను మాత్రం అడ్డుకున్నారు. త్వరలో జరగబోవు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను సైతం అడ్డుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో కేసు ఫైల్ కావడం.. న్యాయమూర్తి స్టే ఇవ్వడంతో.. సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తాజాగా, సుప్రీంలోనూ చుక్కెదురైంది.
జీవో నెంబర్ 1పై విచారణ ముగిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని.. ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం దీనిపై విచారణ చేపడుతుందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్ బెంచ్ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సూచించింది. ఈనెల 23న జీవో నెంబర్ 1పై విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది సుప్రీం.