Hockey World Cup:పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు క్వార్టర్ఫైనల్కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. చివరి పూల్ మ్యాచ్లో వేల్స్ జట్టును 4-2 గోల్స్ తేడాతో ఓడించినా… స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో, క్వార్టర్స్ చేరాలంటే క్రాస్ఓవర్స్ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.
పూల్-డి నుంచి ఇంగ్లాండ్ తొలి స్థానంలో నిలవగా… భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్, ఇంగ్లాండ్ రెండేసి విజయాలు, ఒక్కో డ్రాతో ఏడు పాయింట్లు సాధించి సమంగా నిలిచాయి. కానీ ఎక్కువ గోల్స్ చేసిన ఇంగ్లాండ్ అగ్రస్థానంతో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇక గ్రూప్-సిలో తొలిస్థానంలో నిలిచిన నెదర్లాండ్స్ క్వార్టర్ఫైనల్కు అర్హత సాధించింది. రెండోస్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో… భారత్ ఆదివారం క్రాస్ఓవర్ మ్యాచ్ ఆడుతుంది. ఇందులో గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెడుతుంది.
పూల్-డిలో భాగంగా వేల్స్తో జరిగిన మ్యాచ్లో… భారత్ తరఫున ఆకాశ్దీప్ సింగ్ రెండు గోల్స్ కొట్టగా.. షంషేర్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ చెరో గోల్ సాధించారు. ప్రత్యర్థి జట్టులో గారెత్ ఫర్లాండ్, జాకబ్ డ్రేపర్ గోల్స్ చేశారు. క్వార్టర్ఫైనల్కు నేరుగా అర్హత సాధించాలంటే ఎనిమిది గోల్స్ తేడాతో నెగ్గాల్సిన స్థితిలో బరిలోకి దిగిన భారత్… చాలా పెనాల్టీ కార్నర్లను వృథా చేసింది ప్రపంచ ర్యాంకింగ్స్లో 14వ స్థానంలో ఉన్న వేల్స్.. అయిదో స్థానంలోని భారత్కు కనీస పోటీ అయినా ఇస్తుందా? అని అభిమానులు అనుకుంటే… వేల్స్ దీటుగా భారత జట్టును ఎదుర్కొంది. తొలి క్వార్టర్లో భారత్ ఒక్క గోల్ కూడా చేయకుండా అడ్డుకున్న వేల్స్… మూడో క్వార్టర్లో మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి షాకిచ్చింది. ఓ దశలో… భారీ ఆధిక్యంతో గెలవడం అటుంచితే… భారత్ కనీసం గెలుస్తందా? అని అభిమానులు అనుమానపడ్డారు. కానీ, చివరి క్వార్టర్లో ఆధిపత్యం చెలాయించిన భారత ఆటగాళ్లు… ఎట్టకేలకు గెలిచి పరువు దక్కించుకున్నారు.