Gold: బంగారం అంటే భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలో పెళ్లిళ్లైనా, ఫంక్షన్లైనా, ఇతర ఏ శుభకార్యమైనా… ప్రతి ఒక్కరూ బంగారం కొని తీరతారంటే అతిశయోక్తి కాదు. అందుకే… భారతదేశంలో బంగారం విక్రయాలు భారీగా జరుగుతూ ఉంటాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం… 2021లో మనోళ్లు ఏకంగా 611 టన్నుల బంగారం కొనేశారట. ఆ ఏడాది ప్రపంచంలోనే అత్యధికంగా 673 టన్నుల బంగారం కొనుగోళ్లతో చైనా తొలి స్థానంలో నిలవగా… రెండో స్థానం మనదే.
దేశంలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించింది… ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక. పూర్తిగా బంగారంతో చేసిన సాదా ఆభరణాల విక్రయాలే మొత్తం పసిడి కొనుగోళ్లలో 80 నుంచి 85 శాతం ఉన్నాయని… అవి కూడా 22 క్యారెట్లవేనని డబ్ల్యుజీసీ తెలిపింది. 18 క్యారెట్ల బంగారం ఆభరణాల విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయని పేర్కొంది. మొత్తం ఆభరణాల వ్యాపారంలో పెళ్లికూతుళ్ల కోసం తయారు చేసిన మోడళ్ల వాటానే 50 నుంచి 55 శాతం ఉందని… ఇక రోజువారీ ధరించే నగల వాటా 40 నుంచి 45 శాతంగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. మొత్తం కొనుగోళ్లలో 55 నుంచి 55 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని వెల్లడించింది. అయితే, ఫ్యాషన్ జ్యుయెలరీ అమ్మకాల వాటా కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమేనని ప్రకటించింది.
వివిధ ఆదాయ వర్గాల్లో, ఎవరు ఎక్కువ బంగారం కొంటున్నారనే లెక్క తీస్కే… రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షికాదాయం కలిగిన వాళ్లే అత్యధికంగా ఆభరణాలు కొంటుండగా… ఆ తర్వాత స్థానంలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్నవాళ్లు… లక్ష నుంచి రూ.2 లక్షల వార్షికాదాయం కలిగిన వాళ్లు ఉన్నారు. ఇక మొత్తం దేశంలో జరిగే బంగారం వ్యాపారంలో… 40 శాతం వాటాతో దక్షిణ భారతదేశం అగ్రస్థానంలో ఉందని డబ్ల్యుజీసీ నివేదిక తెలిపింది.