Sleeping Problem:ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రి త్వరగా భోజనం చేసి పడుకున్న తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదని చాలా మంది చెబుతుంటారు. నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం, ప్రతిరోజు ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, ఫోన్లను రాత్రిపూట ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దీనికి ఆయుర్వేదంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యను తగ్గించుకునేందుకు తేనే, పాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిలో చెడేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండిటిని కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే బాగా నిద్ర పడుతుంది. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పాలలో తేనె కలిపి తాగుతున్నా నిద్ర పట్టడం లేదని చాలామంది అనుకుంటారు. అలాంటివారు అశ్వగంధ చూర్ణం వాడితే మంచి ఫలితం ఉంటుంది. పాలలో ఒక టేబుల్ స్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి తీసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడానికి అశ్వగంధం అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. పాలల్లో టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అశ్వగంధ తరహాలోనే జటమాంసి చూర్ణం కూడా పనిచేస్తుంది. దీనిని కూడా పాలలో కలిపి తీసుకోవచ్చు. అశ్వగంధ, జటమాంసి రెండు చూర్ణాలను అర టీ స్పూన్ చొప్పున తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మిశ్రమంగా చేసి గ్లాసు పాలలో కలిపి కూడా తాగవచ్చు. అయితే రెండు టాబ్లెట్ల రూపంలో కూడా లభిస్తాయి. వాటిని వినియోగించినా అదే ఫలితం ఉంటుంది. నిద్రలేని సమస్యకు చందనాది తైలం కూడా పనిచేస్తుంది. దీన్ని రాత్రి పూట కొద్దిగా తీసుకొని జుట్టుకు సున్నితంగా మర్దన చేయాలి. అలాగే పాదాలపై రాసి మర్దన చేయాలి. దీంతో శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా అరికాళ్లలో మంటలు కూడా తగ్గుతాయి.