DGP : ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు కేసు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. 12 మంది అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ట్రిబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్లను రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని ప్రకటించారు. అయితే వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని అధికారుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఏపీ క్యాడర్కు చెందిన 12 ఆలిండియా సర్వీస్ అధికారులు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే సోమేశ్ కుమార్ క్యాడర్ విషయంలో ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే డీవోపీటీ ఆదేశాలు రావడంతో ఆయన తెలంగాణలో సీఎస్ పోస్టును వదులుకుని ఏపీలో రిపోర్ట్ చేశారు.
ప్రస్తుతం తెలంగాణ ఇన్చార్జ్ డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్ కూడా ఏపీ క్యాడరే. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సర్వీస్ అధికారుల విభజనలో భాగంగా అంజనీకుమార్ను ఏపీకి కేటాయించారు. అయితే కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించిన అంజనీకుమార్ తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. గత నెలలో డీజీపీ మహేందర్రెడ్డి పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం ఆ బాధ్యతలను అంజనీకుమార్కు అప్పగించింది.
సోమేశ్ కుమార్, అంజనీ కుమార్ ఇద్దరూ కూడా బీహార్ చెందినవారే. మరికొందరు ఆలిండియా సర్వీస్ అధికారులు కూడా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్నారు. వీరు కొనసాగింపుపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఐపీఎస్లు సంతోష్ మెహ్రా, అభిలాష్ భిష్త్, ఐఏఎస్లు టీఎస్పీఎస్సీ సెక్రటరీగా ఉన్న వాణీప్రసాద్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఆయుష్ కమిషనర్ ఎ.ప్రశాంతి, మరో ఐఏఎస్ సేతు మాధవన్, ఆమ్రపాలి ఏపీలో పనిచేయాల్సి ఉండగా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణ క్యాడర్లో పనిచేస్తున్నారు. ఇక తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్లు శివశంకర్ , హరికిరణ్, గుమ్మల్ల సృజన ఏపీలో పనిచేస్తున్నారు. సోమేష్ కుమార్ కేసు మాదిరిగానే హైకోర్టు తీర్పు వస్తే తెలంగాణ డీజీపీతోపాటు ఇక్కడ పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. అందుకే హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.