BJP: తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్కు పొగబెడుతున్నారా? వివేక్తో ఆయనకు గొడవ జరిగిందా? మాటా మాటా అనుకునే దాకా వ్యవహారం వెళ్లిందా? వివేక్ తనంతట తానే అలా చేశారా? లేక ఎవరైనా వెనకుండి చేయించారా? ఈ అంశాలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్గా మారింది.
తెలంగాణలో బలపడేందుకు బీజేపీ అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు ఎవరివంతుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఐకమత్యంగా పోరాడాల్సిన సమయంలో పార్టీ నేతల మధ్య సఖ్యత చెడిందని తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామిల మధ్య గొడవ జరిగిందని అంటున్నారు.
ఇటీవల వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వాగ్యుద్ధం జరిగిందని ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటలకు వివేక్ కొంత ఆర్థిక సాయం చేశారట. దానికి గానూ ఈటల తన భూమి పత్రాలను వివేక్ దగ్గర తాకట్టు కూడా పెట్టారట. తీసుకున్న మొత్తానికి వడ్డీ కూడా కడుతున్నారట. ఆ విషయంలో ఏదో తేడాలొచ్చి.. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో అందరూ ఉండగానే ఈటలను వివేక్ డబ్బుల గురించి అడిగారట. మొదట దీన్ని ఈటల లైట్ తీసుకుని సమాధానం చెప్పగా.. వివేక్ కాస్త ఘాటుగా మాట్లాడారని… దానికి ఈటల సైతం అంతే ఘాటుగా జవాబిచ్చారని తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వ్యవహారం చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఈటలకు, వివేక్కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఈటల టీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి రావడానికి ఎక్కువగా కృషి చేసిన వారిలో వివేక్ కూడా ఒకరు. మరి అలాంటి నేతల మధ్య ఈ తరహా గొడవ ఎందుకు జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కావాలనే ఈటలకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని.. ఈ ఘర్షణ అందులో భాగమేనని కొందరు అంటున్నారు. బీజేపీలో ప్రస్తుతం సీఎం రేసు నడుస్తోందని.. ఈటల కూడా పోటీలో ఉండడంతో ఆయన్ను వివాదాల్లోకి లాగి పార్టీ నుంచి దూరం చేసేందుకే కొంతమంది కుట్ర పన్నారని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం వివేక్ ఇలాగే సాయం చేశారని.. వారి మధ్య కూడా ఇదే రకమైన గ్యాప్ కొనసాగుతోందనే ప్రచారం బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.
ఈ అంతర్గత విభేదాల్లో నిజమెంతో అబద్ధమెంతో చెప్పలేం గానీ… తెలంగాణ కాషాయదళంలో ఏదో జరుగుతోందన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.