KCR: ఖమ్మం సభకు కొందరు వచ్చారు. కొందరు రాలేదు. వచ్చిన వారి మీద ఆసక్తికంటే.. రానివారి గురించి చర్చే ఎక్కువ నడుస్తోంది. మమత రాలే, స్టాలిన్ రాలే, నితీష్ రాలే, కుమారస్వామి రాలే, ప్రకాశ్ రాజ్ రాలే, ఓవైసీ రాలే.. ఇలా గడగడా లిస్ట్ చెప్పేస్తున్నారు. వీరిలో మిగతా సీఎంల సంగతి ఎలా ఉన్నా.. కుమారస్వామి, ప్రకాశ్ రాజ్, ఓవైసీల గైర్హాజరు మీదే ఎక్కువ చర్చ నడుస్తోంది.
బీఆర్ఎస్ ఆరంభం నుంచీ ఉన్న కుమారస్వామి.. ఇంతటి కీలక సభకు రాకపోవడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ కారణం చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ ఎంపీలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారని.. ఆ విషయం తెలిసే జేడీఎస్ అధినేత కుమారస్వామి ముఖం చాటేశారని అన్నారు. ఇందులో నిజమెంతో ఆయనకే తెలియాలి.
కుమారస్వామి సంగతి పక్కన పెడితే.. ప్రకాశ్ రాజ్ ఎందుకు రానట్టు? ఇటీవల కేసీఆర్ వెంట తరుచూ కనిపిస్తున్నారు ప్రకాశ్ రాజ్. గులాబీ బాస్ వెంబడి కర్నాటక, మహారాష్ట్ర పర్యటనలకు కూడా వెళ్లారు. బీఆర్ఎస్ తో మొదటినుంచీ టచ్ లో ఉన్నారు. మరి, ప్రతిష్టాత్మకంగా భావించిన ఖమ్మం సభకు ప్రకాశ్ రాజ్ ను కూడా పిలిస్తే బాగుండేది కదా. పెద్ద పెద్ద నేతల ముందు.. ఇలాంటి చోటా మోటా వ్యక్తులు ఎందుకని అనుకున్నారో ఏమో? అంటున్నారు. అవసరానికి మాత్రమే వాడుకునే అలవాటున్న కేసీఆర్.. ప్రకాశ్ రాజ్ ను సైతం అలానే కరివేపాకులా వదిలేశారని విమర్శిస్తున్నారు.
ఇక, ఖమ్మం సభకు రాని మరో కీలక నేత, ఎమ్ఐఎమ్ అధినేత, కేసీఆర్కు జాన్ జిగ్రీ దోస్త్ అసదుద్దీన్ ఓవైసీ. అవును, ఎంపీ అసద్ రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి మీటింగ్ లో తప్పక ఉండాల్సిన ఓల్డ్ సిటీ కింగ్.. ఖమ్మంలో ఎందుకు కనిపించలేదు? కేసీఆర్ కావాలనే పక్కన పెట్టేశారా? ఓవైసీ అవసరం ప్రస్తుతానికి లేదనుకున్నారా?
AIMIMకి ఉన్నది ఒకే ఒక ఎంపీ స్థానం. ఆ ఒకేఒక్కడు అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే మాత్రం మజ్లిస్ మద్దతు తప్పనిసరి. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేల బలం ఉంది మరి. అందుకే, రాష్ట్ర స్థాయిలో మాత్రమే మజ్లిస్ పార్టీతో కేసీఆర్ స్నేహం నెరుపుతున్నారని.. జాతీయ స్థాయికి వచ్చేసరికి.. దేశవ్యాప్తంగా పతంగి పార్టీకి అంత పవర్ లేదనే విషయాన్ని గుర్తించే.. బీఆర్ఎస్ ప్రస్థానంలో ఓవైసీ పాత్రను తెలంగాణకే పరిమితం చేస్తున్నారని చెబుతున్నారు. అవసరం ఉంటే నెత్తిన పెట్టుకోవడం.. లేదంటే ఇలా మీటింగ్ కు కూడా పిలవకపోవడం.. కేసీఆర్ నైజం అందరికీ తెలిసిందే కదా అని అంటున్నారు.