Shubman Gill: శుభ్మన్ గిల్ చెలరేగిపోయాడు. డబుల్ సెంచరీతో కుమ్మేశాడు. ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. ఎక్కడ చూసినా అతని గురించే చర్చ. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. అయితే గిల్ ఈ క్రేజ్ను సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. అతడికి క్రికెట్పై ఉన్న ఆసక్తిని చూసి అతని తండ్రి లిఖ్విందర్ ఏకంగా పొలంలోనే గ్రౌండ్, పిచ్ ఏర్పాడు చేశాడు.
నిజానికి క్రికెట్ అవ్వాలనేది శుభ్మన్ గిల్ తండ్రి లిఖ్విందర్ కల అట. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను అవ్వలేకపోయినా.. తన కొడుకును ప్రొఫెషనల్ క్రికెటర్ చేయాలని గట్టిగా సంకల్పించాడు. ఇందుకోసం తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయాన్ని, సొంత ఊరిని వదిలి మొహాలికి షిఫ్ట్ అయిపోయారు.
శుభ్మన్ గిల్కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇంట్రెస్ట్. పడుకునేటప్పుడు కూడా బాల్, బ్యాట్ను పక్కలో పెట్టుకొని పడుకునే వాడట. కొడుకుపై ఉన్న నమ్మకంతో గిల్ తండ్రి అప్పట్లో తన కొడుకు వికెట్ తీస్తే రూ. 100 ఇస్తానంటూ పోటీ పెట్టే వారట. ప్రస్తుతం గిల్ వికెట్ తీయడానికి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు పోటీపడుతున్నారు. గిల్ స్వస్థలం పంజాబ్లోని ఫజిల్కా అనే గ్రామం. మొదట్లో ఓ స్కూల్లో కోచింగ్ తీసుకున్న గిల్ ఆ తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అకాడెమీలో చేరాడు.
కొడుకును ప్రొఫెషనల్ క్రికెటర్ చేయాలన్న తండ్రి కలను నిజం చేయడానికి గిల్ ఎంతగానో కష్టపడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి టీమిండియాలో చోటు సంపాదించుకొని ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యాడు. 2020 డిసెంబర్లో తొలిసారి టెస్టుల్లోకి అడుగుపెట్టిన గిల్ గబ్బాలో జరిగిన రెండో టెస్టులో 91 పరుగులు చేసి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. పోయిన ఏడాది బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.