ShivaKumar: ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్టహాసంగా జరిగాయి. మోదీ రోడ్ షో తో అదరగొట్టారు. కావలసినంత పబ్లిసిటీ తెచ్చుకున్నారు. నడ్డాను మళ్లీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రానున్న ఎలక్షన్లలో పార్టీ అవలంభించాల్సిన విధివిధానాలపై కసరత్తు చేశారు. బీజేపీ ప్రణాళికలను పక్కాగా రచించుకున్నారు.
అంతా బాగుంది. మిగతా అంశాలన్నీ ఓకే. మరి, గోమాత రక్షణ అంశం ఎందుకు ప్రస్తావనకు రాలేదంటూ ప్రశ్నిస్తున్నారు యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె.శివకుమార్. హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ.. బీజేపీ తీరును తప్పుబట్టారు. గోమాత రక్షణపై త్వరలో ‘మహా సంగ్రామం’ పేరిట ఎన్టీఆర్ స్టేడియంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.
పనిలో పనిగా రాజకీయ విమర్శలు కూడా చేశారు. రాబోయే 9 రాష్ట్రాల ఎన్నికల్లో హిందూత్వాన్ని అడ్డం పెట్టుకుని గెలిచేందుకు బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. గోవును కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ ప్రాణిగా ప్రకటించాలని శివకుమార్ డిమాండ్ చేశారు.
ఇదీ సంగతి. ఇంతకీ బీజేపీపై అంతగా విమర్శలు చేస్తున్న ఈ శివకుమార్ ఎవరా అనే అనుమానం రావొచ్చు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే కాదు. ఇంకెవరు అనుకోవచ్చు. కె.శివకుమార్ అనే అతను యుగతులసి ఫౌండేషన్ పేరుతో కొంతకాలంగా గోమాత రక్షణ కోసం తనవంతు ఉద్యమం చేస్తున్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనేది ఇతని అంతిమ డిమాండ్. గతంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర కూడా చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అప్పట్లో ఫుల్ ఫేమస్ అయ్యారు.
శివకుమార్ గురించి ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. ఇతనికి ఎలక్షన్ కమిషన్ రోడ్ రోలర్ గుర్తు కేటాయించడం.. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆ గుర్తును రద్దు చేయడం.. ఆ విషయం విమర్శల పాలవడంతో.. కొన్నిరోజుల పాటు మునుగోడు రాజకీయం శివకుమార్ చుట్టూ తిరిగింది.
అయితే, శివకుమార్ ఇప్పుడు గోమాత పేరుతో ఏదో ప్రయత్నం చేస్తున్నారు కానీ.. పూర్వాశ్రమంలో ఆయన పక్కా పొలిటికల్ లీడర్. వైఎస్సార్ సీపీ తరఫున తెలంగాణ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో వైసీపీ నుంచి గెంటేశారు. మళ్లీ జగనన్నతో రాజీ కుదుర్చుకోవడంతో.. ఇటీవలే ఆయన్ను తెలంగాణ కోటాలో టీటీడీ బోర్డ్ మెంబర్ ని చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు తనదేనంటూ గతంలో రచ్చ చేసింది కూడా ఇతనే.
ప్రస్తుతం శివకుమార్ బీజేపీ-బి టీమ్ సభ్యుడంటూ కూడా ప్రచారం ఉంది. అయితే, తనది కేవలం గోమాత ఉద్యమం మాత్రమేనని.. బీజేపీది మాత్రం హిందుత్వ రాజకీయమని.. తనతో వారిని పోల్చవద్దనేది ఆయన వాదన. ఆ విషయం ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకే ఇప్పుడిలా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని విమర్శించినట్టు యాక్టింగ్ చేస్తున్నారని కూడా అంటున్నారు. గోమాత రక్షణ పేరుతో సాధువుగా కలరింగ్ ఇస్తున్న పక్కా పొలిటికల్ లీడర్ అనే ప్రచారమూ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా శివకుమార్ సిద్ధమవుతున్నారని టాక్. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం అదనపు అర్హత. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. కె.శివకుమార్ గురించి ప్రతీచిన్న న్యూస్ అప్ డేట్.. పలు ప్రముఖ న్యూస్ ఛానెల్స్ లో రెగ్యులర్ గా వస్తుంటాయంటే అతని మీడియా మేనేజ్ మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో గెస్ చేయవచ్చు. డబ్బున్నోళ్లు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేగా.