Kodandaram : ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జై తెలంగాణ అనడానికి సిగ్గు ఎందుకు అని ప్రశ్నించారు. ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించిన కోదండరాం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు.
తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ విధ్వంసం చేశారని కోదండరాం ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న కేసీఅర్ సింగరేణిలో సగం వాటా ప్రైవేట్ పరం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యా, వైద్యం ప్రైవేట్ అయ్యాయని.. ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై ఢిల్లీలో పోరాడుతామని ప్రకటించారు. 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని కోదండరాం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని చెప్పడం అబద్దమన్నారు. ప్రాజెక్టు కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు పూర్తి కాలేదన్నారు. కృష్ణా నదీపైనా ప్రాజెక్టులు అన్ని పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారని కోదండరాం ఆరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కేసీఆర్ జై తెలంగాణ అనకపోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇదే విషయంపై కేసీఆర్ ను విమర్శించారు. మరి గులాబీ బాస్ జై తెలంగాణ నినాదం చేయకపోవడంపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.