AP Employees Unions Leaders : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎం జగన్ కు షాక్ ఇచ్చారు. సకాలం తమకు వేతనాలు అందడంలేదని ఆరోపిస్తూ విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. సూర్యనారాయణ, ఆస్కారరావుతోపాటు మరో ఆరుగురు నేతలు వెళ్లి గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం పలు ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెలా ఒకటో తేదీనే ఇవ్వాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్ నిధులను విత్డ్రా చేశారని ఆరోపించారు. 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారని వెల్లడించారు. తాము ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారని.. అందుకే గవర్నర్ను కలిసి అన్ని విషయాలు వివరించామన్నారు. బకాయిల చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరామని సూర్యనారాయణ తెలిపారు. తమ సమస్యలను గవర్నర్ సానుకూలంగా విని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడంలేదని సూర్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తామని తెలిపారు. ఏప్రిల్ నుంచి రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఆందోళన చేపడతామని ప్రకటించారు. ఆర్థికశాఖ అధికారులు, మంత్రివర్గ ఉపసంఘానికి సమస్యలు చెప్పామన్నారు. వారు స్పందించకపోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు.
మొత్తంమీద ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అడుగు ముందుకు వేసి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగసంఘాల నేతల మాటలు చూస్తుంటే ఆందోళన బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. మరి సీఎం జగన్ ఈ సమస్యకు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.